అమెరికా నూతన అధ్యక్షుడు బైడెన్ సారథ్యంలోని అగ్రరాజ్య ప్రభుత్వం పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్లకు వెళ్లాలనుకునే తమ దేశ ప్రజలకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ముఖ్యంగా పాకిస్థాన్ వెళ్లాలనుకునేవారు తమ ప్రయాణాలపై మరోసారి ఆలోచించుకోవాలని సూచించింది. కరోనా మహమ్మారి వ్యాప్తితో పాటుగా ఉగ్రవాదుల హింస ఎక్కువగా ఉండడమే అందుకు కారణంగా పేర్కొంది. ఆ దేశంలోని బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్సులకు మాత్రం అసలు వెళ్లొద్దని, అక్కడ ఉగ్రవాదుల ముప్పు ఎక్కువగా ఉందని తెలిపింది. అలాగే నియంత్రణ రేఖ సమీప ప్రాంతాల్లోకి వెళ్లొద్దని హెచ్చరించింది. అక్కడ ఉగ్రవాద ముఠాల కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయని పేర్కొంది.
నియంత్రణ రేఖకు ఇరువైపులా భారత్, పాక్ల సైనిక బలగాలు భారీ సంఖ్యలో మోహరించి ఉంటాయని, వాటి మధ్య ఎప్పుడు ఎదురు కాల్పులు జరుగుతూ ఉంటాయని తెలిపింది. బంగ్లాదేశ్లో నేరాలు, ఉగ్రవాదం, అపహరణల ముప్పు దృష్ట్యా అక్కడికి వెళ్లినప్పుడు అత్యంత అప్రమత్తతతో ఉండాలని సూచించింది. అఫ్గాన్లో ఆత్మాహుతి దాడులు, ఉగ్రవాదంతో విపత్కర పరిస్థితులు నెలకొని ఉన్నాయని, అక్కడికి వెళ్లకపోవడమే మంచిదని పేర్కొంది.