దర్శకధీరుడు రాజమౌళి- సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. గతేడాది ఓ ఇంటర్య్వూలో రాజమౌళినే ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమా కోసం రాజమౌళి అదిరిపోయే స్టోరీ లైన్ సిద్ధం చేశారని, పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా నిర్మించనున్నారని సమాచారం. అయితే తాజాగా ఈ కాంబినేషన్ గురించిన క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. మహేష్ కోసం రాజమౌళి మాస్టర్ ప్లాన్ వేశారని తెలుస్తోంది. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఈ కథను రాసే పనిలో ఉన్నారట. సాధారణంగానే బలమైన కథను సిద్ధం చేసి జక్కన చేతిలో పెట్టే ఆయన ఈసారి మహేష్ కోసం ఎవరూ ఊహించని రేంజ్ లో కథ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
పూర్తిగా అడవి నేపథ్యంలో సాగే భారీ బడ్జెట్ సినిమా అని సమాచారం. ఆఫ్రికాలోని దట్టమైన అడవుల్లో పోరాట సన్నివేశాలు తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు భారతీయ చిత్రపరిశ్రమ చూడని రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. గతేడాది లాక్డౌన్ సమయంలో ఈ క్రేజీ ప్రాజెక్టుపై విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి చాలా కసరత్తులు చేశారని, 2022లో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుందని సమాచారం. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబరు 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక మహేష్ బాబు విషయానికొస్తే.. పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా 2022 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.