‘ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న’ మదర్ థెరిస్సా చెప్పిన ఈ మాటలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం. కోట్లు కూడబెడితే వచ్చే సంతోషంతో పోలిస్తే, ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటే వచ్చే ఆనందమే వేరు. చరిత్రలో పీడకలను మిగిల్చిన సంవత్సరం 2020. కరోనా ప్రభావం ప్రపంచంలోని ప్రతి ఒక్కరిపైనా పడింది. భారతదేశంలో లాక్డౌన్ విధించడంతో లక్షల మంది ఇబ్బందులు పడ్డారు.
ఇలాంటి ఆపత్కాలంలో నటుడు సోనూ సూద్ రియల్ హీరో అనిపించుకున్నాడు అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ వెళ్లారు. వలస కార్మికుల కోసం, బస్సులు, రైళ్లు, విమానాలు తన సొంత డబ్బులతో ఏర్పాటు చేశారు. ఆగిపోయిన పెళ్లిళ్లకు సాయం చేశారు. పేద రైతుకు ట్రాక్టర్ వచ్చేలా చేశారు. పేద విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. తన దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కరికీ సోనూ సాయం అందించారు..తాజాగా ఓ అడుగు ముందుకేసిన సోనూసూద్ హైదరాబాద్ లో అంబులెన్స్ సర్వీస్ని ప్రారంభించాడు. ఇటీవల కొన్ని వ్యాన్స్ను కొనుగోలు చేసిన సోనూసూద్ వాటిని అంబులెన్స్లుగా మార్చి ప్రజలకు సాయపడేందుకు సిద్దమయ్యాడు. హైదరాబాద్లోని ట్యాంక్బండ్ ప్రాంతంలో సర్వీస్ లాంచ్ చేయగా, రానున్న రోజులలో వీటిని మరికొన్ని ప్రాంతాల్లో విస్తరిస్తామని పేర్కొన్నాడు.