నటీనటులు: మోహన్లాల్, మీనా, అన్సిబియా హసన్, ఏస్తర్ అనిల్, ఆశా శరత్, సిద్ధిఖీ, మురళీ గోపీ, సాయికుమార్ నిర్మాత: ఆంటోనీ పెరంబవూర్; దర్శకత్వం: జీతూ జోసెఫ్, సంగీతం: అనిల్ జాన్సన్
ఆరు సంవత్సరాల క్రితం మలయాళంలో సూపర్ హిట్ సాధించిన సినిమా ‘దృశ్యం’. ఈ మూవీ తెలుగు, తమిళంతోపాటు మరో మూడు భాషల్లో రీమేక్ అయ్యి.. అక్కడ కూడా భారీ హిట్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమా సిక్వెల్ను మరోసారి మలయాళంలో తెరకెక్కించారు. మలయాళ స్టార్ మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలో నటించగా.. జీతు జోసెఫ్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ మూవీని అమెజాన్ ప్రైమ్లో విడుదల చేశారు. మరి దృశ్యం 2 చిత్రం వీక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఈ సమీక్షలో చూద్దాం.
కథ:
దృశ్యం సినిమా క్లైమాక్స్ నుండి ఈ సినిమా కథ ప్రారంభం అవుతుంది..వరుణ్ మిస్సింగ్ కేసు నుంచి బయటపడిన జార్జ్ కుట్టి (మోహన్లాల్) కుటుంబం చక్కటి జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. కేబుల్ టీవీ ఆపరేటర్ స్థాయి నుంచి థియేటర్ ఓనర్గా, ఓ ప్రొడ్యూసర్ గా ఎదుగుతాడు జార్జ్. అయితే వరుణ్ కేసుకు సంబంధించిన భయాలు మాత్రం జార్జ్ కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంటాయి. పోలీసులు ఎక్కడ కనిపించినా జార్జ్ భార్య రాణి (మీనా), పిల్లలు అంజు, అనుమోల్ (అన్సిబా, ఏస్తర్ అనిల్) బయపడుతుంటారు. పెద్ద కుమార్తె తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆమెకు పెళ్లి చేస్తే ఆమె మాములు మనిషి అవుతుందని జార్జ్ కుటుంబం భావిస్తుంది. ఇదిలావుంటే వరుణ్ను జార్జ్ కుటుంబమే చంపి ఉంటుందని ఊళ్లో చాలా మంది అనుకుంటూ ఉంటారు. పోలీసులకు అదే అనుమానం కలగడంతో ఆ కేసును సీక్రెట్గా విచారిస్తుంటారు. అదే సమయంలో ఐజీ థామస్ బాస్టిన్ (మురళీ గోపీ) ఆ కేసును మళ్ళీ తెరుస్తాడు. అప్పుడు జార్జ్ ఏం చేశాడు? కేసు రీఓపెన్తో జార్జ్ కుటుంబం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? అనేదే మిగతా కథ.
విశ్లేషణ:
‘దృశ్యం’ లాంటి సినిమాకు సీక్వెల్ అంటే అంచనాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకుడి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కథ, కథనాలను నడిపించాడు దర్శకుడు జీతూ జోసెఫ్. వరుణ్ మిస్సింగ్ కేసు పూర్తయి ఆరేళ్లు అయిన తర్వాత నుంచి కథను మొదలు పెట్టిన దర్శకుడు ఆ కేసు భయాలతో జార్జ్ భార్య, పిల్లలు ఎలాంటి మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారన్నది ఆసక్తిగా చూపించాడు. ఇక జార్జ్ కుట్టి పాత్రలో మోహన్లాల్ అద్భుతంగా నటించాడు. జార్జ్ భార్యగా మీనా, కుమార్తెలుగా అన్సిబా, ఏస్తర్లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. మొదటి భాగంలో లేని కొన్ని పాత్రలు ఇందులో వచ్చాయి. వారంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా చక్కగా ఉంది. సతీశ్ కురూప్ సినిమాటోగ్రఫీ.. అనిల్ జాన్సన్ నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్గా నిలిచాయి.
ప్లస్ పాయింట్స్ : మోహన్లాల్ నటన, దర్శకత్వం
మైనస్ పాయింట్స్ : సాగదీత సీన్లు
రేటింగ్: 4/5