ఉత్తరాఖండ్లో భారీ మంచుచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. చమోలీ జిల్లాలోని జోషి మఠ్లో ధౌలి గంగ నదికి అకస్మాత్తుగా వరదలు రావడంతో తపోవన్లోని రుషి గంగ పవర్ ప్రాజెక్టుకు భారీ నష్టం వాటిల్లింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టులో పని చేస్తున్న దాదాపు 150 మంది కార్మికులు గల్లంతయ్యారు. కాగా..వరదల ప్రభావం ఉత్తర ప్రదేశ్పై కూడా పడింది. ఉత్తర ప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. గంగానది పరీవాహక ప్రాంతాల్లోని జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.అలాగే ధౌలిగంగా నదీ తీరానికి వెళ్లొద్దని స్థానికులకు అధికారులు ఆదేశాలు జారీచేశారు. వరద ఉధృతి పెరిగే అవకాశం ఉండటంతో ధౌలిగంగా తీరంలో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.కాగా..ఈ సమాచారం అందుకున్న ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్ వెంటనే ఘటనాస్థలికి బయల్దేరారు. సీఎంతో పాటు చమోలి జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా ఉన్నారు.
ఇక ఉత్తరాఖండ్ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరాతీశారు. ఉత్తరాఖండ్ సీఎం రావత్తో ఫోన్లో మాట్లాడి సహాయ చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా వరదల్లో చిక్కుకుంటే, ఏదైనా సహాయం కావాలంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ నెంబరు 107 లేదా 955744486కి కాల్ చేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం పేర్కొంది.
మరోవైపు కేబినెట్ సెక్రటేరియట్లో సహాయ చర్యల సమీక్ష నిమిత్తం హోంశాఖ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది.ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ దళాల డీజీలతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొననున్నారు. అలాగే సహాయక చర్యల నిమిత్తం రెండు ఎంఐ-17తో పాటు ఏఎల్హెచ్ ధ్రువ్ చాపర్ను రంగంలోకి దింపినట్లు భారత వాయుసేన అధికారులు తెలిపారు. అవసరమైతే మరిన్ని విమానాలను పంపేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
కాగా..ఉత్తరాఖండ్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్రమోదీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అసోం పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచే ఉత్తరాఖండ్ సీఎం రావత్తో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.