ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో 81.78 శాతం పోలింగ్ నమోదైనట్లు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 85.06 శాతం నమోదైనట్లు పేర్కొంది. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎస్ఈసీ సంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కృషిచేసిన అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అభినందించారు.
కాగా..ఈ రోజు(మంగళవారం)మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరగ్గా, అనంతరం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందరూ ఉహించినట్టే విజయదుందుభి మోగించింది. ఇప్పటి వరకు 580 పంచాయతీలకు ఫలితాలు రాగా, వైసీపీ ఏకంగా 543 స్థానాలు కైవసం చేసుకుంది. ప్రతిపక్ష టీడీపీకి చెందిన అభ్యర్థులు ఇప్పటి వరకు 27 స్థానాల్లో గెలిచారు. బీజేపీ, జనసేన అభ్యర్థులు ఇప్పటి వరకు ఖాతా తెరవలేదని తెలుస్తోంది. ఇక, 10 మంది ఇతరులు గెలిచారు.
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలు జిల్లాల వారీగా..
◆తూర్పుగోదావరి (366): వైసీపీ 29, టీడీపీ 0, ఇతరులు 1 ◆పశ్చిమగోదావరి (239): వైసీపీ 38, టీడీపీ 0, ఇతరులు 3 ◆కృష్ణా (234): వైసీపీ 21, టీడీపీ 2 ◆చిత్తూరు (454): వైసీపీ 106, టీడీపీ 6 ◆ప్రకాశం(227): వైసీపీ 31, టీడీపీ 4, ఇతరులు 0 ◆గుంటూరు(337): వైసీపీ 65, టీడీపీ 2 ◆కర్నూలు(193): వైసీపీ 50, టీడీపీ 1, ఇతరులు 1 ◆శ్రీకాకుళం(321): వైసీపీ 39, టీడీపీ 0 ◆విశాఖ (340): వైసీపీ 42, టీడీపీ 1, ఇతరులు 1 ◆నెల్లూరు (163): వైసీపీ 22, టీడీపీ 2, ఇతరులు 1 ◆కడప(206): వైసీపీ 51, టీడీపీ 0, ఇతరులు 0 ◆అనంతపురం(169): వైసీపీ 6, టీడీపీ 0
నోట్: ఏపీ పంచాయతీ ఎన్నికల్లో పూర్తి స్థాయి ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది.