పేద ప్రజలకు అందించే రేషన్ కార్డుల పంపిణీపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంట్లో టీవీ, ఫ్రిజ్, ద్విచక్ర వాహనం ఉంటే రేషన్ కార్డును ఇవ్వకూడదని నిర్ణయించింది. బీపీఎల్ కార్డుల మంజూరు విషయంలో ఇకపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించదని ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖమంత్రి ఉమేష్ కత్తి స్పష్టం చేశారు. సోమవారం బెళగావిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. సంపన్న కుటుంబీకులు కూడా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే రేషన్ సరుకులను ఉపయోగించుకున్నారని, దీని ద్వారా పేదలకు సరుకులు చేరడంలేదని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునే ఉద్ధేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.
అలాగే కొత్త రేషన్ కార్డులు పొందేందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఈ కార్డు తీసుకోవాలంటే ఐదెకరాల కంటే ఎక్కువ భూమి కలిగి ఉండకూడదు. టీవీ, ఫ్రిజ్, మోటార్సైకిల్ లాంటి వస్తువులు ఉండకూడదు. ఇవి ఉన్న రేషన్ కార్డుదారులు మార్చి 31లోగా కార్డులను తిరిగిచ్చేయాలి.. లేదంటే వారిపై చర్యలు తప్పవు. రూ. 1.20లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయం పొందేవారు రేషన్ కార్డులు ఉపయోగించకూడదు అని ఉమేశ్ కత్తి వెల్లడించారు.
మరోవైపు మంత్రి ఉమేశ్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల ఎదుట పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టీవీ, ఫ్రిజ్ లాంటివి ఇప్పుడు ప్రతీ ఇంట్లో ఉన్నాయి. వడ్డీ లేని రుణాల ఇచ్చినప్పుడు సాధారణంగానే ప్రజలు ఇలాంటివన్నీ కొనుక్కుంటారు. అంతమాత్రానికే వారికి రేషన్ తొలగించడం సరికాదు. ఈ ప్రభుత్వం పేదలను వ్యతిరేకంగా పనిచేస్తోంది అని కాంగ్రెస్ పార్టీ కర్ణాటక సర్కారుపై విమర్శల వర్షం కురిపించింది.