కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రపంచవ్యాప్తంగా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 82దేశాలు టీకా పంపిణీ మొదలుపెట్టగా, దాదాపు 18కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అమెరికాలో భారీ సంఖ్యలో అక్కడివారికి టీకా అందిస్తుండగా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్లలోనూ వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోంది. అటు ఇజ్రాయిల్, బ్రెజిల్ సైతం టీకా పంపిణీని వేగంగా చేపడుతున్నాయి.
కాగా, ప్రపంచంలో వేగంగా టీకా అందిస్తున్న దేశాల్లో అమెరికా, బ్రిటన్లు తొలి రెండు స్థానాల్లో ఉండగా, భారత్ మూడో స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.రెండు నెలల క్రిందట టీకా ప్రక్రియ ప్రారంభించిన అమెరికాలో ఇప్పటివరకు ఐదున్నర కోట్ల మందికి వ్యాక్సిన్ అందించారు. ఇక బ్రిటన్లోనూ ఇప్పటికే కోటిన్నర మందికి పంపిణీ చేసినట్లు సమాచారం. తాజాగా భారత్ కూడా 94లక్షల మార్కును దాటినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే, అమెరికా, బ్రిటన్లు వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించి 60రోజులు పూర్తికాగా, భారత్ మాత్రం 33రోజుల్లోనే దాదాపు కోటి మందికి టీకా అందించింది. జనవరి 16న భారత్లో కరోనా టీకా పంపిణీ ప్రారంభం కాగా, ఫిబ్రవరి 13 నుంచి రెండో డోసు ఇవ్వడం మొదలుపెట్టారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 94,22,228 వ్యాక్సిన్ డోసులను అందించగా, వీరిలో 61లక్షల 96వేల మంది వైద్యారోగ్య సిబ్బంది తొలి డోసు తీసుకున్నారు.