ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా మంగళవారం ముగిసిన చివరి టెస్టులో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 89 పరుగులు చేసి సంచలన ఇన్నింగ్స్తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆటలో చివరి రోజు.. అదీ పిచ్ నుంచి టర్న్ లభిస్తున్న సమయంలో స్పిన్నర్ నాథన్ లయన్ని అతను ఎదుర్కొన్న తీరుపై మాజీ క్రికెటర్ల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. 328 పరుగుల లక్ష్య ఛేదనలో యువ ఓపెనర్ శుభమన్ గిల్ 91 పరుగులు చేసి విజయానికి బాటలు వేసినా.. ఆ తర్వాత పుజారా 56 పరుగులు, రహానె 24 పరుగులు, మయాంక్ అగర్వాల్ 9 పరుగులు చేసి ఔటవడంతో.. టీమిండియా డ్రా కోసం ప్రయత్నిస్తుందని అంతా ఊహించారు. కానీ.. రిషబ్ పంత్ అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ.. టీ20 తరహా ఇన్నింగ్స్తో మరో 19 బంతుల ఆట మిగిలి ఉండగానే టీమిండియాకి 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు
ఈ క్రమంలోనే రిషబ్ పంత్ … తన కెరీర్లో అత్యుత్తమ టెస్ట్ ర్యాంక్ సాధించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో 13వ స్థానానికి ఎగబాకాడు. వికెట్ కీపర్లలో తొలి స్థానం అతనిదే కావడం విశేషం.పంత్ తర్వాత దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్ నిలిచాడు. టెస్ట్ ర్యాంకింగ్స్లో 15 స్థానం దక్కించుకున్న డికాక్.. వికెట్ కీపర్గా రెండో స్థానంలో ఉన్నాడు. మరోవైపు, టీమిండియా ఆటగాళ్లలో శుభమన్ గిల్ 68వ స్థానం నుంచి 47వ స్థానానికి, పుజార 17వ స్థానానికి, సిరాజ్ 45వ స్థానానికి ఎగబాకారు.అలాగే మూడో స్థానంలో ఉన్న టీమిండియా కెప్టెన్ కోహ్లీ 4వ స్థానానికి పడిపోయాడు.