నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు పటిష్ఠ స్థితిలో నిలిచింది. వరుసగా మూడో రోజు ఆటలోనూ ఆధిపత్యం చెలాయించిన పర్యాటక జట్టు మెల్లమెల్లగా పట్టు బిగిస్తోంది. భారత జట్టులో యువ ఆటగాడు రిషభ్ పంత్ (88 బంతుల్లో,91 పరుగులు), నయా వాల్ చెతేశ్వర్ పుజారా (143 బంతుల్లో,73 పరుగులు) చేసి రాణించారు. దాంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 6 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది.వాషింగ్టన్ సుందర్ (33 పరుగులు), రవిచంద్రన్ అశ్విన్ (8 పరుగులు) చేసి క్రీజులో నిలిచారు. బెస్ 4 వికెట్లు, ఆర్చర్ 2 వికెట్లు పడగొట్టారు. కాగా, ఇంగ్లాండ్ జట్టు కంటే టీమిండియా ఇంకా 321 పరుగుల వెనుకబడి ఉంది.
ఇక అంతకుముందు 555/8 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 578 పరుగులకు ఆలౌటైంది.మరో 23 పరుగులు చేసి ఆఖరి రెండు వికెట్లు కోల్పోయింది. బెస్ (34 పరుగులు)ను బుమ్రా వికెట్లు ముందు దొరకబుచ్చుకున్నాడు. అండర్సన్ (1)ను అశ్విన్ క్లీన్బౌల్డ్ చేశాడు. లీచ్ (14 పరుగులు) నాటౌట్గా నిలిచాడు. భారత్ బౌలింగ్లో బుమ్రా, అశ్విన్ మూడు వికెట్లు తీయగా..నదీమ్, ఇషాంత్ లకు రెండు వికెట్లు దక్కాయి.
మరోవైపు టీమిండియా యువ హిట్టర్ రిషబ్ పంత్ మరోసారి సెంచరీ ముంగిట పేలవంగా వికెట్ పారేసుకున్నాడు. ఈ రోజు దూకుడుగా ఆడిన రిషబ్ పంత్ (91: 88 బంతుల్లో 9×4, 5×6) శతకానికి 9 పరుగుల దూరంలో సిక్స్ కొట్టబోయి ఔటైపోయాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్లో 97 (సిడ్నీ), 89 (గబ్బా) పరుగులు చేసిన రిషబ్ పంత్.. సెంచరీ మార్క్ని మాత్రం అందుకోలేకపోయాడు. తాజాగా చెపాక్లోనూ అదే తరహాలో శతకం ముంగిట ఈ 23 ఏళ్ల హిట్టర్ ఔటైపోయాడు. బ్యాటింగ్కి అనుకూలిస్తున్న చెపాక్ పిచ్పై స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ కనిపించిన రిషబ్ పంత్.. డొమినిక్ బెస్ బౌలింగ్లో సిక్స్ కొట్టబోయి ఫీల్డర్ జాక్ లీచ్ చేతికి చిక్కాడు.